సాక్షి, హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఏ పార్టీలో అయితే రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టారో.. ఆ పార్టీ కండువాను దాదాపు మూడు దశాబ్దాల తర్వాత కప్పుకున్నారు. మహాకూటమి పుణ్యమా.. కాంగ్రెస్తో జతకట్టిన చంద్రబాబు.. బుధవారం సనత్నగర్లో జరిగిన ఎన్నిక ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంగాభవానీ అనే మహిళా నేత చంద్రబాబుకు కాంగ్రెస్ కండువా కప్పారు. నాడు కాంగ్రెస్కు వ్యతిరేకంగా దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ టీడీపీని స్థాపిస్తే.. నేడు ఆ పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ కండువా వేసుకున్నారు.
దేశ ప్రయోజనాల కోసమే కాంగ్రెస్-టీడీపీలు కలిసాయని ఈ సందర్భంగా చంద్రబాబు స్పష్టం చేశారు. తెలంగాణ భవిష్యత్తు కోసం మహాకూటమిని గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. గత ఎన్నికల్లో బీజేపీతో జతకట్టి.. కాంగ్రెస్ను ఓడించాలని పిలుపునిచ్చిన చంద్రబాబే.. ఇప్పుడు ఆపార్టీని గెలిపించమని, బీజేపీని ఓడగొట్టాలని చెబుతుండటం చూసి ప్రజలు విస్తుపోతున్నారు.